Jio నుంచి కొత్త యాప్‌.. ఏడాది పాటు ఉచితంగా సేవలు.. ఏంటంటే..

Jiosafe App-India: టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో వాట్సాప్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంతకు ఏ విషయంలో అంటే..

Jiosafe App-India: టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో వాట్సాప్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంతకు ఏ విషయంలో అంటే..

టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో.. ఇప్పటికీ తన ప్రభంజనం కొనసాగిస్తూ వస్తోంది. అప్పటికే ఈ రంగంలో దిగ్గజాలుగా ఉన్న మిగతా టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చింది. ఉచితంగా సిమ్ములతో పాటుగా డేటా ఇవ్వడంతో కస్టమర్లు.. అటు వైపు మారారు. ఇన్నాళ్లు టెలికాం రంగంలో తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ వస్తోన్న జియో.. తన తాజా నిర్ణయంతో కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అందుకు కారణం ఇన్నాళ్ల పాటు ఎంతో చౌకగా డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సౌకర్యాలు అందించిన జియో.. జూలై నుంచి రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో మిగతా టెలికాం కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తూ.. ప్లాన్స్‌ రేట్లను పెంచాయి. దాంతో కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా తాజాగా జియో సరికొత్త యాప్‌ను లాంఛ్‌ చేసింది. ఏడాది పాటు ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

ప్రస్తుతం వీడియో కాల్స్‌, మెసేజ్‌లు, ఫొటోలు పంపించడానికి వాట్సాప్‌ను వినియోగిస్తున్నాం. ఈ క్రమంలో తాజాగా జియో వాట్సాప్ లాంటి కొత్త చాట్ అప్లికేషన్‌ను లాంచ్ చేసింది. దీని పేరు జియోసేఫ్. వీడియో కాల్ చేయడానికి ఈ యాప్ మరింత సురక్షితమైనదని, ఎక్కువ ప్రైవసీ ఉంటుందని అని జియో వెల్లడించింది. మొదటి ఏడాది పాటు.. ఈ యాప్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అని తెలిపింది. ఆ తర్వాత ఇది 199 రూపాయల నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ఉన్న మైనస్‌ పాయింట్‌ ఏంటి అంటే.. జియోసేఫ్ అప్లికేషన్‌ను 5జీ నెట్‌వర్క్‌లో మాత్రమే ఉపయోగించవచ్చు. అంటే 4జీ నెట్‌వర్క్‌లలో లేదా జియో సిమ్‌ లేని వినియోగదారులు ఈ యాప్‌ను ఉపయోగించలేరు. అంతేకాక ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. జియోసేఫ్‌ యాప్ మెటా వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది చాలా సురక్షితమైన యాప్. దీనిని ఎవరూ హ్యాక్ చేయలేరని వారు చెప్పుకొచ్చారు. ఫీచర్లను బట్టి చూస్తూ.. జియోసేఫ్‌ ఇది మెటా వాట్సాప్‌కు గట్టి పోటీ ఇస్తుందనే చాలామంది భావిస్తున్నారు. అయితే ఒక సంవత్సరం ఉచితంగా ఉపయోగించుకున్న తరువాత నెలవారీ చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. అప్పుడు నెలవారీ సబ్‌స్క్రీప్షన్‌ కోసం 199 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

జియోసేఫ్ సేఫ్టీ అనేది జియో 5జీ క్వాంటం సెక్యూర్ నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 256 బిట్ నెట్‌వర్క్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది. వినియోగదారుల వివరాలను గోప్యంగా ఉంచడానికి సబ్‌స్క్రైబర్ కన్సీల్డ్ ఐడెంటిటీ (ఎస్‌సీఐ) సాంకేతికతను ఉపయోగిస్తుంది. మరి జియోసేఫ్‌ను కస్టమర్లు ఏమేర ఆదరిస్తారో చూడాలి అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.

Show comments