YCP MLA Kondeti Chittibabu Hospitalized: YCP ఎమ్మెల్యేకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్.. హైదరాబాద్‌కు తరలింపు

YCP ఎమ్మెల్యేకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్.. హైదరాబాద్‌కు తరలింపు

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం చిట్టిబాబు ఉన్నట్లుండి అనారోగ్యానికి గురయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుడికాలు లాగుతుంది అని చెప్పడంతో వెంటనే ఆయనను రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్కడ డాక్టర్లు చిట్టిబాబుని పరీక్షించి.. ఆయన “మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్” కు గురయ్యారని నిర్దారించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆయనను వెంటనే హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా మూడు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు సూచించారు.

ఎమ్మెల్యే ఆరోగ్య విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వారు వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల్లోకి వస్తారని తెలిపారు. ఎమ్మెల్యే చిట్టిబాబు బుధవారం జగ్గంపేట ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ క్రమంలో పెళ్లికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యానికి గురయినట్లు తెలిసింది. కొండేటి చిట్టిబాబు 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున పి గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మరోసారి పోటీచేసి విజయం సాధించారు.

Show comments