Dharani
Dharani
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్.. స్వర్ణభారత్ ట్రస్టు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా స్వర్ణ భారత్ ట్రస్టీ దీపా వెంకట్ గొప్ప మనసును చాటుకున్నారు. ఓ యువతిని దత్తత తీసుకోవడం మాత్రమే కాక.. ఆమె స్వయంగా దగ్గరుండి దత్తత తీసుకున్న యువతికి వివాహం జరిపించారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున.. శిరీష అనే యువతిని దత్తత తీసుకున్నారు దీపా వెంకట్. ఈ క్రమంలో తాజాగా శిరీష వివాహం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు దీపా వెంకట్. అంతేకాక వివాహం సందర్భంగా పెళ్లి కుమార్తె శిరీష పేరు మీద రూ.లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు బంగారు నగలు కానుకగా అందజేశారు దీపా వెంకట్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం నిడుంపల్లికి మడితపు శివయ్య, బుజ్జమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే మద్యానికి బానిసైన శివయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. శివయ్య చనిపోయిన కొంత కాలానికే అతడి భార్య బుజ్జమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్.. శివయ్య-బుజ్జమ్మ దంపతుల ఐదుగురి కుమార్తెలను.. 2016లో తమ ట్రస్టు ద్వారా దత్తత తీసుకున్నారు.
అనాటి నుంచి వారి ఆలనాపాలనా చూడటం మాత్రమే కాక.. ఆ ఐదుగురు యువతులను కూడా తమ ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నారు దీపా వెంకట్. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ఐదుగురిలో పెద్దమ్మాయి అయిన శిరీష వివాహ వేడుకల్లో దీపా వెంకట్ స్వయంగా పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఏడేళ్ల కిందట దత్తత తీసుకున్న అమ్మాయిని.. చదివించి పెద్ద చేయడమే కాకుండా.. ఎంతో ఘనంగా సదరు యువతి వివాహం చేసి ఉదారతను చాటుకున్న దీపా వెంకట్ను అందరూ అభినందిస్తున్నారు. ఐదుగురు అక్కాచెల్లెళ్లలో పెద్ద కుమార్తె అయిన శిరీషకు వివాహం చేశారు. మిగిలిన ప్రసన్న, మల్లీశ్వరి, నందిని, లిజితలను చదివిస్తూ.. వారి బాగోగులు చూడటమేకాక.. తమ ట్రస్టులోనే చదివిస్తున్నారు. మిగిలిన నలుగురు అమ్మాయిలకు కూడా తగిన వయసు రాగానే వివాహాలు చేయిస్తానని దీపా వెంకట్ చెప్పుకొచ్చారు. ఆమె మంచి మనసు మీద ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.