Dharani
Dharani
ఆపద అని తెలిస్తే చాలు నేనున్నాను అంటూ ఆదుకుంటారు.. సమస్యల్లో ఉన్నాం.. సాయం చేయండి అంటే చాలూ.. అప్పటికప్పుడే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి.. మీకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి. ఆయన మంచి మనసుకి అద్దం పట్టే సంఘటనలు ఇప్పటికే అనేకం చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సీఎం జగన్. విజయవాడలోని ఓ నిరుపేద కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారి కుటుంబానికి అండగా నిలిచి.. పాప చికిత్స కోసం తక్షణ సాయం అందించారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.
శ్రీనివాసరావు-కల్లగుంట శ్యామలాదేవి దంపతులు విజయవాడ, మధురానగర్లో నివాసం ఉంటున్నారు. వీళ్లకు 14 నెలల వయసు ఉన్న చిన్నారి ఉంది. ఇంత చిన్న వయసులోనే పాపకు కంటి క్యాన్సర్ సోకింది. దీంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పాపకు చికిత్స అందిస్తున్నారు. కానీ ఆర్థిక భారం ఎక్కువైపోతుండడంతో.. సీఎం వైఎస్ జగన్ను కలిసి తమ వ్యథను వినిపించాలనుకున్నారు. ఇలా ఉండగానే వారికి జగన్ ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతున్న సంగతి తెలిసింది. ఎలాగైనా సీఎంతో మాట్లాడి.. తమ కష్టం చెప్పుకోవాలనుకున్నారు. దాంతో ఏ కన్వెన్షన్ హాల్కు వెళ్లారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో.. ఆయన దగ్గరుండి చిన్నారి తల్లిదండ్రులను సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్లారు.
చిన్నారి పరిస్థితి గురించి తెలుసుకున్న సీఎం జగన్ అధైర్య పడొద్దని.. తాను అండగా ఉంటానని ఆ దంపతులకు భరోసా ఇచ్చారు. అంతేకాక తన ప్రక్కనే వున్న ఎన్టిఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్ కుమార్ను పిలిచి.. చిన్నారి కుటుంబానికి తక్షణ ఆర్ధిక సహాయం అందించాలని ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో.. జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి పిలిపించుకుని రూ. లక్ష చెక్కును తక్షణ సాయం రూపంలో అందజేశారు. అంతేకాక చిన్నారి చికిత్సకు ప్రభుత్వం తరపు నుంచి అవసరమైన అన్ని రకాల సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.