Elections 2024-Bhupalpally Collector, Vote Invitation To Voters: వినూత్న ఆలోచన: ఓట్ల పండుగకు ఆహ్వాన పత్రిక.. విందు మాత్రం హైలెట్‌

వినూత్న ఆలోచన: ఓట్ల పండుగకు ఆహ్వాన పత్రిక.. విందు మాత్రం హైలెట్‌

Elections 2024: ఓటు హక్కు మీద అవగాహన, ఆవశ్యకత తెలపడం కోసం ఓ జిల్లా కలెక్టర్‌ వినూత్న ప్రయత్నం చేశాడు. అది నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

Elections 2024: ఓటు హక్కు మీద అవగాహన, ఆవశ్యకత తెలపడం కోసం ఓ జిల్లా కలెక్టర్‌ వినూత్న ప్రయత్నం చేశాడు. అది నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్‌ పూర్తవ్వగా.. మే 13న నాలుగో దశ పోలింగ్‌ జరగనుంది. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణలో ఓటింగ్‌ జరగనుంది. ఇక నేటితో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఇక ఎన్నికల నోటిషికేషన్‌ వెలువడిన నాటి నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో భూపాల్‌బల్లి జిల్లా కలెక్టర్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఏకంగా ఓటు ఆహ్వానపత్రికను రెడీ చేసి అందరికి పంచుతున్నారు.

సాధారణంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యల కోసం ఆహ్వానపత్రికలు పంచుతుంటారు. బంధుమిత్రులకు కార్డ్స్‌ పంచుతారు. దానిలో వేడుకు, సమయం, విందు సమయం, ఆహ్వానించే వారి వివరాలు దాని మీద పొందుపరుస్తుంటారు. ఇక తాజాగా ఓట్ల పండుగ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యారు. ఓట్ల పండుగ కోసం ఆహ్వాన పత్రికను తయారు చేయించి పంచుతున్నారు.

భారత ప్రజాస్వామ్య పండుగ–లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు 2024కు.. తమ కుటుంబంలోని ఓటర్లందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామంటూ కలెక్టర్‌ భవిష్‌ మిశ్రా ఆ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. మే 13, 2024 సోమవారం రోజున, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అనే శుభకార్యాన్ని నిర్వహించనున్నట్టు.. చెప్పుకొచ్చారు. వేదికగా మీ పోలింగ్ స్టేషన్‌ అని మెన్షన్ చేశారు. దాని కిందే.. విందు అని పెట్టి.. 5 సంవత్సరాల పాటు శక్తివంతమైన ప్రజాస్వామ్యం ఫలాలు అని పేర్కొనటం.. ఆహ్వాన పత్రికకే హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ వెరైటీ ఆహ్వాన పత్రికలో ఓ గమనిక కూడా పెట్టారు. అదేంటంటే.. దయచేసి ఎన్నికల కమిషన్ ద్వారా ధృవీకరించబడిన మీ ఫొటో ఐడీ కార్డుల్లో ఏదైనా ఓ కార్డును వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఆహ్వానించువారు దగ్గర.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అని ఉండటం గమనార్హం. ఓటర్లంతా పోలింగ్ రోజు తమ హక్కును వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో కలెక్టర్ మిశ్రా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

Show comments