Idream media
Idream media
దొంగతనానికి కాదేదీ అనర్హం నిరూపించారు ఈ దొంగలు. ఏకంగా ఓ నదిపై ఉన్న ఉన్న బ్రిడ్జినే దొంగిలించారు. అదీ పట్టపగలే. అందరూ చూస్తుండగానే. అదెలాగ అంటారా..?
బీహార్ రాష్ట్రంలోని రోహ్తాహ్ జిల్లా అమియావర్ గ్రామంలో 1972లో ఆరా నదిపై 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తుతో ఓ వంతెనను నిర్మించారు. అయితే, ఆ వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో.. చాలాకాలం నుంచి వాడుకలో లేదు. దీనికి బదులుగా కాంక్రీటు వంతెన నిర్మించారు. ఓ దొంగల ముఠా పాత వంతెన ఇనుముపై కన్నేసింది. ఇంకేముంది.. ఎర్త్మూవర్ యంత్రం, గ్యాస్ కట్టర్లు వంటి సరంజామాతో గ్రామంలోకి దొంగలు వచ్చారు.
నీటి పారుదల శాఖ సిబ్బందిమంటూ పరిచయం చేసుకొన్నారు. ప్రమాదకర స్థితిలో ఉన్న వంతెనను తొలగించాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయని చెప్పారు. యంత్రంతో బ్రిడ్జిని కూల్చేసి.. గ్యాస్ కట్టర్లతో వంతెనను భాగాలుగా కత్తిరించి.. ఇనుప రద్దును వ్యాన్లో వేసుకొని ఉడాయించారు. మూడురోజులపాటు ఈ తతంగం జరిగిందని.. ఈ నెల 5కి వంతెన ఆనవాళ్లు కూడా లేకుండా చేశారని స్థానికులు చెప్పారు. ఆ తర్వాత ఈ నెల 8న గ్రామస్థులు అసలు విషయం గ్రహించి నీటిపారుదల అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. దొంగతనంలో ఇరిగేషన్ శాఖ ఇంటిదొంగల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు.
కాగా.. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. 2017లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్జేడీ నుంచి జేడీ(యూ) తెగతెంపులు చేసుకోవడాన్ని ఉటంకిస్తూ.. బీహార్ సీఎం నితీష్ కుమార్, బీజేపీ నాయకుల నుంచి ఆ దొంగలు ప్రేరణ పొందివుంటారంటూ ప్రతిపక్షనేత తేజస్వియాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, గత ఏడాది ఆగష్టులో బీహార్లోని వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకొన్న అక్రమ ఇసుక, కంకరను పలు పోలీస్ స్టేషన్ల వద్ద ఉంచారు. అవీ దొంగలపాలయ్యాయి. ఆ కేసుల్లో చోరులు ఇప్పటికీ పోలీస్లకు చిక్కలేదు.