బెంగళూరులో సిద్ధార్థ్‌కు అవమానం.. సారీ చెప్పిన శివరాజ్‌కుమార్‌!

సినిమా ప్రమోషన్‌ కోసం బెంగళూరుకు వెళ్లిన సిద్ధార్థ్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రం ‘ చిత్తా’ ప్రమోషన్‌ కోసం ఆయన బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. మీటింగ్‌ మధ్యలో ఉండగా..కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు అక్కడకు ఎంట్రీ ఇచ్చారు. కావేరీ నదీ జలాల విషయంలో తమిళనాడుకు వ్యతిరేకంగా.. బెంగళూరు వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఓ తమిళ సినిమాకు ఎలా ప్రమోషన్‌ చేస్తారంటూ సిద్ధార్థ్‌పై మండిపడ్డారు.

మీటింగ్‌ను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. సిద్ధార్థ్‌ కన్నడలో మాట్లాడే ప్రయత్నం చేసినా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో సిద్ధార్థ్‌ విలేకరులకు నమస్కారం పెట్టి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ సంఘటనపై తాజాగా, ప్రముఖ కన్నడ హీరో శివరాజ్‌ కుమార్‌ స్పందించారు. ఆందోళనకారుల కారణంగా ఇబ్బందికి గురైన సిద్ధార్థ్‌కు ఆయన క్షమాపణ చెప్పారు.

శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ మొన్న ఓ ప్రెస్‌మీట్‌ జరుగుతూ ఉంది. వేరే భాష హీరో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడికి పోయి మీటింగ్‌ ఆపేశారు. దాన్ని ఎవరు ఆపారో నాకు తెలీదు. అది తప్పు కదా.. కన్నడ ప్రజలు ఎప్పుడూ అందర్నీ స్వాగతిస్తారు. సిద్ధార్థ్‌ గారికి క్షమాపణలు చెబుతున్నా. నాకు చాలా బాధేసింది. దీన్ని మనసులో పెట్టుకోకండి. కన్నడ ప్రజలు చాలా మంచి వాళ్లు’’ అని చెప్పుకొచ్చారు. మరి, సిద్ధార్థ్‌కు శివరాజ్‌కుమార్‌ క్షమాపణలు చెప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments