ప్రముఖ నటుడి ఇంట్లో తీవ్ర విషాదం!

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి శాంతీరాణి చక్రవర్తి కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైలోని నివాసంలో శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని మిథున​ చక్రవర్తి చిన్న కుమారుడు నమషి చక్రవర్తి ధ్రువీకరించారు. ‘‘ నాన్నమ్మ చనిపోయిన వార్త నిజమే.. ఆమె మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది’’ అని పేర్కొన్నారు.

మిథున్‌ చక్రవర్తి తల్లి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, మిథున్‌ చక్రవర్తి 1976లో వచ్చిన మ్రిగయా అనే బెంగాలీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. దో అంజానేతో హిందీలోకి అడుగుపెట్టారు. ఆనతి కాలంలో హిందీలో స్టార్‌ హీరోగా ఎదిగారు. ఐయామే డిస్కో డ్యాన్సర్‌ పాటతో దేశ వ్యాప్తంగా సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సినిమాలు చేస్తున్నారు.

గోపాల గోపాల సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. మలుపు సినిమాలోనూ నటించారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టీవీ షోలలో కూడా పాల్గొంటున్నారు. ఇక, సినిమాల్లో ఫేమస్‌ అయిన తర్వాత ఆయన తన తల్లిదండ్రులను కోల్‌కతా నుంచి ముంబైకి తెచ్చుకున్నారు. ఇక, అప్పటినుంచి వాళ్లు మిథున్‌ దగ్గరే ఉంటున్నారు. రెండేళ్ల క్రితం మిథున్‌ తండ్రి అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఈ శుక్రవారం ఆయన తల్లి కన్నుమూశారు.

Show comments