పుంగనూరులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోన్న టీడీపీ కార్యకర్త.. వీడియో వైరల్‌

పుంగనూరులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోన్న టీడీపీ కార్యకర్త.. వీడియో వైరల్‌

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్‌ల సందర్శన యాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అంగళ్లు గ్రామంలో పరిస్థితి చేయి దాటింది. చంద్రబాబు తన రోడ్‌ షోలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో.. వారంతా రెచ్చిపోయి.. ప్రశాంతంగా ఉండే పుంగనూరులో భయానక వాతావరణం సృష్టించారు. రోడ్‌ షోకు బందోబస్తు కల్పించడానికి వచ్చిన పోలీసులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. వైసీపీ కార్యకర్తలు, పోలీసులుపై ఇష్టమొచ్చినట్లు దాడి చేశారు.. రాళ్లు రువ్వారు.. ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు. టీడీపీ కార్యకర్తల వీరంగాన్ని చూసి భయపడిన జనాలు.. ఇళ్లల్లోకి వెళ్లి దాక్కున్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

దీనిలో ఒక టీడీపీ కార్యకర్త.. వీడియో తీస్తున్నారని తెలిసి.. ధైర్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పుంగనూరు పుడింగి ఎక్కడ అంటూ ప్రశ్నించాడు.. ఉదయం నుంచి కాచుకుని ఉన్నాం.. ప్రభుత్వ వాహనాలను కూడా ధ్వంసం చేశామంటూ గొప్పగా చెప్పుకోవడం వీడియోలో చూడవచ్చు. పైగా ఈ వీడియోను అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్‌ చేస్తానంటూ చెప్పడం గమనార్హం. పుంగనూరులో ఉద్రిక్తతలకు సంబంధించి పోలీసులు 30 మందిపై కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి వారిని పరమార్శించారు.

Show comments