Idream media
Idream media
గత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అప్పటి ప్రభుత్వంలో టిడిపి నేతలే కాంట్రాక్టర్లగా వ్యవహరించి చాలా నిర్మాణ పనులను చేపట్టారు. నాణ్యత లేకుండా లాభార్జనే లక్ష్యంగా నాడు చేసిన నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని అప్పటి ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయి. అయితే చంద్రబాబు అవేవి పట్టించుకోకుండా తన పార్టీ నేతలను వెనకేసుకొచ్చారు. దీంతో అప్పటి అక్రమాలు ఇప్పుడు బయట పడుతున్నాయి. ఇటీవలి శ్రీకాకుళం జిల్లాలో ఒక టిడిపి నేత అడ్డంగా దొరిగాడు.
గత టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్లో ఆ పార్టీ నాయకులు ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగింది. అయితే అప్పట్లో వారు చేపట్టిన పనుల్లోని డొల్లతనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలి మండలం పాతనౌపడలో గత టిడిపి హయాంలో ఆపార్టీ మాజీ ఎంపిటిసి పరపటి చిన్నయ్యరెడ్డి కాంట్రాక్టర్గా వ్యవహరిస్తూ సుమారు రూ.15 లక్షల అంచనా మేరకు సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అయితే అప్పట్లో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు కావడంతో ఆ పనులను మధ్యలోనే నిలిపివేశారు. అసంపూర్తిగా వదిలేసిన సుమారు 80 మీటర్ల రోడ్డుకు క్రషర్ వేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు తప్ప.. రోడ్డుపై క్రషర్ వేయలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఎటువంటి పనులు చేపట్టలేదు. రెండు రోజుల క్రితం ఇదే పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టగా అసలు విషయం బయటపడింది. క్రషర్ వేయకుండా రికార్డుల్లో ఎలా నమోదు చేశారంటూ అధికారులు నిలదీయడంతో సదరు టిడిపి మాజీ ఎంపిటిసి బిత్తరపోయారు.
హడావుడిగా క్రషర్ వేయడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో రికార్డుల్లో నమోదు చేసి క్రషర్ వేయకుండా.. ఇప్పుడు అధికారులు తనిఖీలు చేసిన తరువాత క్రషర్ వేయడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ప్రాంత వాసులు కొంత మంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ పనులు నిలిపివేశారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధి పనులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్న అక్రమాలు వెలుగు చూస్తాయని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.
ఇలా నాటి చంద్రబాబు పాలనలో పోలవరం, రాజధాని నిర్మాణం నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడ ఏది తలపెట్టిన అక్రమాలే జరిగాయి. ఇలాంటి అక్రమాలు తవ్వుతుంటే మరికొన్ని బయట పడుతున్నాయి. ప్రధానంగా సిసి రోడ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చింది.