రాష్ట్రంలోని కార్మికులంతా అల్లల్లాడిపోతున్నారు…ఎక్కడాలేని దయనీయ పరిస్థితులు ఏపీలోనే ఉన్నాయి…తొట్ట తొలిసారి మేడే రోజు కార్మికులంతా పస్తులుంటున్నారు…దీనికి కారణం…సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే…! ఇవీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు అవాకులూ చవాకులూ…! దీంతో కార్మికుల సంగతేమో కానీ, అధికారానికి దూరమై తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లల్లాడిపోతున్నారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
బోండ ఉమా విజయవాడకు సెంట్రల్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా సొంత అభివృద్ధిపైనే దృష్టిపెట్టి..గత ఎన్నికల్లో ప్రజల తిరస్కరానికి గురయ్యారు. తాజాగా కరోనా ఆసరాగా బోండా ఉమా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై చౌకబారు విమర్శలకు దిగుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కార్మికులు ఏపీలో పస్తులు ఉంటున్నారంటూ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను వైఎస్ జగన్ వేరే కార్యక్రమాలకు తరలిస్తున్నారని వాపోతున్నారు. కాగా, కేంద్రం యూపీ లాంటి ఉత్తరాధి రాష్ట్రానికి రూ.8000 కోట్లకు పైగా నిధులివ్వగా ఏపీకి రూ. 2 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. కానీ, ఇవేవీ పట్టని బోండ ఉమ కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తే జగన్ వాటిని దారిమళ్లిస్తున్నారంటూ, మాస్కుల పంపిణీలో అవినీతంటూ చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దీంతోపాటు గతం ప్రభుత్వం డబ్బులంటూ…అవేవో టీడీపీ నాయకుల సొంత జేబుల్లో నుంచి ఇచ్చిన డబ్బుల్లా మాట్లాడటం నిజంగా గర్హనీయం.
చంద్రబాయునాయుడు ఎప్పటికప్పుడు ప్రధానమంత్రితోపాటు మేధావులతో మట్లాడి ప్రజలకు సహాయం చేస్తున్నారు…కానీ, జగన్ ప్రజలను పట్టించుకోవట్లేదు….! ఇవీ బోండా ఉమా తాజా పొగడ్తలు, విమర్శలు..! అయితే ఇక్కడ హైదరాబాద్లోని ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబుపైనేమో పొగడ్తలు కురిపించడం…నిరంతరం సమీక్షలు, సమావేశాలతో తీరికలేకుండా గడుపుతున్న వైఎస్ జగన్పైనేమో విమర్శలు చేయడం బోండ ఉమా ప్రత్యేకతని చెప్పొచ్చు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో దేశంలో ఏ ముఖ్యమంత్రీ, ఏ నాయకుడు గొప్పగా కనిపించని బోండ ఉమా వంటి టీడీపీ నాయకులకు…జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం కేసీఆర్ వంటివారు మేటి నాయకులుగా కనిపించడం నిజంగా వారి ద్వంద ప్రమాణాలకు నిదర్శనమని చెప్పొచ్చు.
ప్రస్తుతం ప్రజలు, కార్మికులపై ప్రేమ ఒలకబోస్తున్న బోండా ఉమాకు అవినీతి, దౌర్జన్యం, దోపిడీకి కొమ్ము కాస్తాడనే చెడ్డ పేరుంది. ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గాన్ని సొంత జాగీరుగా భావించి పెత్తనం చేసిన చరిత్ర ఈయన సొంతం. స్వాతంత్య్ర సమరయోధుల భూములతోపాటు ఒక మహిళకు చెందిన ఇంటినీ కబ్జా చేశారనే ఆరోపణలు బోండ ఉమాపై ఉన్నాయి. నోటి దురుసుతో చివరకు కార్పొరేటర్లు సైతం చీదరించుకునే స్థితికి వెళ్లిన బోండా ఉమా వంటి వారు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సుద్దులు చెప్పడం నిజంగా శోచనీయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.