Bar Council-Holiday, On Jan 22nd: జనవరి 22న శెలవు ప్రకటించమని చీఫ్ జస్టిస్ కి బార్ కౌన్సిల్ అర్జీ

Ayodhya Ram Mandir: జనవరి 22న శెలవు ప్రకటించమని చీఫ్ జస్టిస్ కి బార్ కౌన్సిల్ అర్జీ

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 22న సెలవు ప్రకటించాలని.. బార్‌ కౌన్సిల్‌.. ప్రధాన న్యాయమూర్తికి అర్జీ పెట్టుకుంది. ఆ వివరాలు..

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 22న సెలవు ప్రకటించాలని.. బార్‌ కౌన్సిల్‌.. ప్రధాన న్యాయమూర్తికి అర్జీ పెట్టుకుంది. ఆ వివరాలు..

ఈ నెల 22వ తారీఖున జరగబోతున్న రామమందిర మహోత్సవం, ప్రాణ ప్రతిష్ట పవిత్ర కార్యక్రమాలలో పాల్గొనడం కానీ, లేదా వీక్షించడానికి గానీ అనువుగా ఆ రోజున కోర్టులకు శెలవు ప్రకటించమని కోరుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసింది. దేశమంతా ఎంతో ఉద్విగ్నభరితంగా ఎన్నాళ్ళగానో ఎదురుచూసిన ఈ పవిత్ర మహోత్సవం దేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా అభివర్ణిస్తూ, ఇటువంటి మహత్తర ఘట్టాన్ని పరిఫూర్ణంగా కనులారా చూసి ధన్యులమవుతామని, అందుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శెలవు ప్రకటించి, అందుకు పరిస్థితిని సుగమం చేయాల్సిందిగా ఆ లేఖలో బార్ కౌన్సిల్ వినతి చేసుకుంది.

చీఫ్ జస్టిస్ కల్పించే ఈ అవకాశం ద్వారా న్యాయవాద సంఘం, అలాగే కోర్టులకు సంబంధించిన సిబ్బందికి రామజన్మభూమిలో జరగబోయే కార్యక్రమాలను, దానికి సంబంధించి దేశవ్యాప్తంగా చోటు చేసుకునే స్పందన, ఆయా కార్యక్రమాలను చూసి తరించేందుకు వీలుగా అవకాశం కల్పించమని బార్ కౌన్సిల్ కోరింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా రాసిన లేఖ అందరిలో ఆసక్తిని రేపింది.

జనవరి 22న శెలవుదినంగా ప్రకటించిన దరిమిలా ఆ రోజున ముందుగా షెడ్యూల్ అయిన అతి ముఖ్య వాదనలను మరుసటి రోజుకు వాయిదా వేయవలసిందని మిశ్రా ఛీఫ్ జస్టిస్ కు తెలియజేశారు. ‘’దయతో తమ కోరికను మన్నించి, శెలవు ప్రకటించమని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాం. దీనికి సంబంధించి సత్వర చర్యలు వెంటనే తీసుకుని, దేశవ్యాప్త సెంటిమెంట్ ని మన్నించమన్నదే మా వినతి.’’ అని మిశ్రా తన లేఖలో పేర్కొన్నారు.

ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి చెందిన కార్యక్రమాలను దేశప్రజలను ఉర్రూతలూపడమే కాకుండా, శరవేగంతో జరుగుతున్నాయి. అతి ముఖ్య రాజకీయనాయకులు, యోగులు, అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు దాదాపు 7000 మంది ప్రాణ ప్రతిష్ట ఉత్సవానికి హాజరవుతున్నట్టుగా అంచనా. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వందమంది వరకూ వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు కూడా పాలు పంచుకోబోతున్నారు.

సోమవారం నాడు ఆలయ ట్రస్ట్ ప్రకటించినట్టుగా రామమందిర గర్భగురి సువర్ణ ద్వారాలు అమర్చడం పూర్తయింది. ప్రాణప్రతిష్ట జనవరి 22న జరగుబోతుండగా, అంతకు ముందు జరిగే ఆచారవిధులు మంగళవారం నాడే ప్రారంభమయ్యాయి. మైసూర్ కు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిని శ్రీరామ విగ్రహాన్నే ప్రాణ ప్రతిష్టకు ఎంపిక చేయడం విశేషం. బుధవారం రోజున కలశపూజ కూడా పూర్తయింది. జనవరి 21 వరకూ నిర్వహించే పూజావిధివిధానాలు పూర్తయ్యాక, 22న ప్రాణ ప్రతిష్ట జరుగబోతోంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో 121 మంది మహా ఆచార్యులు పాల్గొని, ప్రతిష్టా విధానాన్ని నెరపబోతున్నారు. 22వ తారీఖున మధ్యాహ్నం మ్రిగశిర నక్షత్రం ఉన్న ఘడియలలో అభిజిత్ ముహూర్తంలో 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ట ప్రారంభమై, 1గంటలకు పూర్తవుతుంది.

Show comments