iDreamPost

ఆన్ లైన్ గొడవలతో సాధించేది ఏముంది?

ఆన్ లైన్ గొడవలతో సాధించేది ఏముంది?

హీరోల మీద అంతులేని అభిమానంతో యువత దారి తప్పుతోంది. లేనిపోని గొప్పలకు పోయి తాము ఆరాధించే వాళ్లే గొప్పన్న భావనలో ఎంత గొడవకైనా సిద్ధపడిపోతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హయాంలో పోస్టర్ల మీద పిడకలు కొట్టేవాళ్ళు. తర్వాత కాలంలో గోడలకు నిచ్చెనలేసుకుని మరీ చింపేసేవారు. ఆ తర్వాత థియేటర్ల దగ్గర కొట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. మహా సంగ్రామం రిలీజ్ టైంలో కృష్ణ శోభన్ బాబు ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తే పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చిందని అప్పట్లో మీడియా కథనాలు వచ్చాయి

ఇప్పుడంతా ఇంటర్ నెట్ యుగం. ఎవరూ నేరుగా తలపడరు. ట్విట్టర్ లో ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి హీరో ఫోటో తగిలించి డూప్లికేట్ పేరుతో వ్యవహారం నడిపించి అవతల వాళ్ళను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉన్నారు. ఏదీ నిజాయితీగా ఉండదు. కేవలం బురద జల్లడమే పనిగా పెట్టుకుంటారు. ఇప్పుడిది కొత్త రూపం తీసుకుంది. నిన్న కొందరు ప్రభాస్ మహేష్ బాబు ఫ్యాన్స్ ట్వీట్లతో పరస్పరం ట్రోల్స్ చేసుకోవడమే కాక వీధుల్లోకి రండి నువ్వో నేనో చూసుకుందాం అనే దాకా వచ్చింది.

బెంగళూరు హైదరాబాద్ లో నిన్న వీళ్ళు చేసిన రచ్చ ట్విట్టర్ లో ట్రెండింగ్ జరిగిపోయింది. ఒకడు ఏకంగా తాగేసి వచ్చి మూసాపేట్ శ్రీరాములు థియేటర్ దగ్గర సవాల్ విసురుతున్న వీడియో వైరల్ అయ్యింది. ఇంతా చేసి వీళ్లంతా తాపత్రయపడుతోంది ఎవరి కోసమంటే కేవలం తమ స్టార్ల గురించి గొప్పలు చెప్పుకోవడానికే. ఒకపక్క ఆర్ఆర్ఆర్, వాల్తేరు వీరయ్య లాంటి మల్టీ స్టారర్లు వస్తుంటే కింది స్థాయిలో ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి అర్థం లేని వివాదాలతో టైం వేస్ట్ చేస్తున్నారు. ఏదైనా తేడా వస్తే కటకటాలకు వెళ్లే రిస్క్ ఉందని తెలిసినా కూడా కొంచెం కూడా తెలివి ఉపయోగించరు ఎందుకో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి