iDreamPost
iDreamPost
దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండన్నట్టు ఉంది తెలుగుదేశం పార్టీ వైఖరి. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధికార వైఎస్సార్ సీపీపై కడుపు మంటతో ఏదో ఒక అసంబద్ధమైన వ్యాఖ్య చేయడం.. నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా మొత్తం పార్టీ నాయకులందరూ దానికి విస్తృతంగా ప్రచారం కల్పించడం ఒక ఆనవాయితీగా మారింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో సంక్రాంతి కళ తప్పిందని చంద్రబాబు నిన్న ప్రకటించారో లేదో ఈ రోజు మాజీ మంత్రి దేవినేని ఉమా దాన్నే వల్లించారు.
విజయవాడలో బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన సీఎం జగన్మోహన్రెడ్డి అసమర్థ పాలన కారణంగా ఏపీలో సంక్రాంతి పండుగ కళ తప్పిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కానుకలను పేదలకు అందించామన్నారు. అయితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పండుగలకు పేదలకు కానుకలు అందించలేకపోతోందని ఆయన ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి 36 నెలల పరిపాలనలో 3.86 లక్షల కోట్ల అప్పును చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ డబ్బును ఏ సంక్షేమ పథకాలకు ఎంతెంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాడ్ చేశారు.
ఆ ఆరోపణలో అర్థముందా?
పసలేని ఆరోపణలు చేసి జనంలో పరువు తీసుకోవడం తప్ప తెలుగుదేశం ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదని ఎప్పటి నుంచో విమర్శలు ఎదుర్కొంటోంది. టీడీపీ అధికారంలో ఉండగా క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి పండగలకు ఇచ్చిన చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా వంటి వాటితో పండగలు కళకళలాడిపోయినట్టు బిల్డప్ ఇవ్వడం విచిత్రం. అప్పట్లో చంద్రన్న కానుకగా ఇచ్చిన సరుకుల విలువ మొత్తం రూ.400కు చేయదు. ముక్కి పోయిన కందిపప్పు, పాకంలా కారిపోయే బెల్లం వంటి నాసిరకం సరుకులు ఇచ్చి, ప్రచారం మాత్రం ఊదరగొట్టేసేవారు. చాలాచోట్ల వాటిని మీడియా ఎదురుగుండా ప్రదర్శించి నాణ్యత లేని ఇటువంటి సరుకులు ఇస్తే మాత్రం ప్రయోజనం ఏమిటని లబ్ధిదారులు అప్పట్లో ప్రశ్నించారు కూడా. ఇంతోటి భాగోతాన్ని పట్టుకొని చంద్రబాబు పాలనను స్వర్ణయుగం మాదిరి పోల్చేస్తూ అప్పటిలో సంక్రాంతి కళకళ లాడిపోయేదని, ఇప్పుడు కళ తప్పిందని ప్రచారం చేయడం దిగుజారుడు రాజకీయం తప్ప ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read : మంత్రి పదవిపై మనసు పారేసుకున్న అబ్బాయి!
నిజమైన పండగ ఇప్పడే..
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా ముందుచూపుతో ప్రణాళిక బద్ధంగా తమ పార్టీ ప్రభుత్వం పనిచేస్తోందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. దాదాపు ప్రతి ఇంటికి సంక్షేమ లబ్ధి అందేలా పథకాలను తమ నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేశారని చెబుతున్నారు. టీడీపీ పాలనలో ఇచ్చిన చంద్రన్న కానుకతో పండగ చేసుకున్నారని చెప్పడం హాస్యాస్పదమని, రూ.లక్షల కోట్ల సొమ్ముతో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ప్రజలు నిజమైన పండగ ఇప్పుడే చేసుకుంటున్నారని అంటున్నారు. చీటికి మాటికీ సీఎం జగన్ అప్పు చేశారని గగ్గోలు పెట్టడం అన్యాయమని, దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు అప్పులు చేస్తున్న సంగతి టీడీపీకి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం 3.86 లక్షల కోట్ల అప్పును చేసిందని, ఈ డబ్బును ఏ సంక్షేమ పథకాలకు ఎంతెంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో కనీసం గమనించడం లేదా అన్న అనుమానం కలుగుతోంది.
వివిధ సంక్షేమ పథకాల సొమ్మును లబ్ధిదారులకు అందించడానికి ఒక కేలండర్ను ప్రకటించి, దాని ప్రకారం పథకాల సొమ్మును ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న విషయం టీడీపీ నేతలకు కనిపించడం లేదా? ఏ నెలలో.. ఏ పథకం కింద, ఎంతమంది లబ్ధిదారులకు సొమ్ము జమ చేస్తున్నదీ ముందుగానే ప్రకటించి పకడ్బందీగా పంపిణీ చేస్తుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడమే విడ్డూరం. వంక లేని అమ్మ డొంక పట్టుకుని ఏడ్చింది అన్నట్టు రోజూ ఏదో అంశంపై అర్థం పర్థం లేని ఆరోపణలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే తప్ప టీడీపీ ఎప్పుడైనా ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చిందా అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Also Read : టిడిపికి మరో పత్రిక …. ఈసారి సొంత పత్రిక !