మసాలా దోశతో సాంబార్ ఇవ్వలేదని.. రెస్టారెంట్ కి వేలల్లో ఫైన్ వేసిన కోర్టు!

మసాలా దోశతో సాంబార్ ఇవ్వలేదని.. రెస్టారెంట్ కి వేలల్లో ఫైన్ వేసిన కోర్టు!

సాధారణంగా మనిషి అనేవాడు భోజన ప్రియుడు. పూట పూటకు ఒక వెరైటీ ఉండాలని కోరుకుంటాడు. మన ముత్తాత, తాతల రోజుల్లో అంటే పొద్దున్నే చద్దన్నంలో మజ్జిగ పోసుకుని ఒక ఉల్లిపాయ కొరుక్కుని హ్యాపీగా తినేవాళ్లు. కాలం మారేకొద్దీ రకరకాల వెరైటీలతో పొద్దున్నే అల్పాహారం తినడానికి అలవాటు పడిపోయాం. అందులోనూ సౌత్ ఇండియా అనగానే ఇడ్లీ, వడ, పూరీ, పొంగల్, దోశ, ఊతప్పం అంటూ చాలానే వెరైటీలు ఉంటాయి. ఒక్కో వెరైటీలో మళ్లీ పదుల సంఖ్యలో సబ్ కేటగిరీలు కూడా ఉంటాయి.

మరి.. అన్ని రకాలు తినడం అవసరమా అంటే? కచ్చితంగా అవసరం అంటూ చాలా మంది సమాధానం చెబుతారు. కొందరైతే టిఫిన్ లోకి చట్నీ, సాంబార్, అల్లం చట్నీ అంటూ అన్నీ ఉండాలి అంటారు. ఇలాగే ఒకాయన మసాలా దోశలోకి సాంబారు ఇవ్వలేదని ఏకంగా కోర్టుకెక్కాడు. అలా కోర్టుకెళ్లడమే కాదండోయ్.. సదరు రెస్టారెంట్ నుంచి ఫైన్ కూడా వసూలు చేశాడు. చదవడానికే కాస్త వింతగా ఉందా? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వింటే ఇంకెంత షాకవుతారో..!?

ఈ ఘటన బిహార్ లోని బక్సర్ లో 11 నెలల క్రితం జరిగింది. మనీష్ గుప్తా అనే ఒక లాయర్ తన పుట్టిన రోజు(ఆగస్టు 15, 2022) సందర్భంగా ఆయనకు ఆయన ఒక ట్రీట్ ఇచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకు నమక్ రెస్టారెంట్ నుంచి ఒక స్పెషల్ మసాలా దోశ పార్శిల్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఎంతో ఆతురతగా తిందామని కవర్లో చూడగా.. అతనికి సాంబార్ ప్యాకెట్ కనిపించలేదు. వెంటనే తిరిగి ఆ రెస్టారెంటుకు వెళ్లాడు. స్పెషల్ మసాలా దోశకు సాంబారు ఇవ్వలేదని చెప్పాడు. మనీష్ గుప్తా చేసిన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదు. పైగా నువ్వ కట్టిన 140 రూపాయలకు మొత్తం రెస్టారెంట్ రాసివ్వమంటావా అంటూ హేళన చేశారు. తిరిగి ఇంటికి వెళ్లిన మనీష్ గుప్తా ఆ రెస్టారెంట్ కు నోటీసులు పంపాడు. కానీ, వాళ్లు ఆ నోటీసులకు సమాధానం చెప్పలేదు. వెంటనే మనీష్ జిల్లా కంజ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

కేసు ఫైల్ చేసిన 11 నెలల తర్వాత కంజ్యూమర్ కోర్టు డివిజన్ బెంచ్ మనీష్ గుప్తా కేసులో తీర్పు ఇచ్చారు. ఈ ఘటనలో మనీష్ గుప్తా మానసిక, శరీరక, ఆర్థికంగా అనుభవించిన వేదనను గుర్తించారు. ఈ మొత్తం ఘటనలో రెస్టారెంట్ తప్పు చేసిందని తేల్చారు. నమక్ రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా విధించారు. ఇందులో రూ.1,500 లిటిగేషన్ కాస్ట్, రూ.2000 బేసిక్ ఫైన్ అని చెప్పారు. 45 రోజుల్లోగా ఈ జరిమానాని మనీష్ గుప్తాకు చెల్లించాలని ఆదేశించారు. గడువు లోపల రెస్టారెంట్  ఆ మొత్తాన్ని కట్టని పక్షంలో 8 శాతం వడ్డీతో కట్టాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇకపై ఏ హోటల్, రెస్టారెంట్ల వాళ్లు సాంబార్, చట్నీలు ఇవ్వకపోతే మనం కూడా కంజ్యూమర్ కోర్టులో కేసు వేయాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Show comments