iDreamPost

సరిలేరులో అన్నీ సరిపోయాయా?

సరిలేరులో అన్నీ సరిపోయాయా?

నిన్న హైదరాబాద్ లో జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాగా ఎన్నో ఏళ్ళ తర్వాత అలనాటి వింటేజ్ జంట చిరు విజయశాంతిలు ఒకే వేదికను షేర్ చేసుకోవడం అభిమానులకు కనులవిందుగా అనిపించింది. ఈ సందర్భంలోనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. క్లుప్తంగా కథ ఏంటో చెప్పే ప్రయత్నం రెండున్నర నిమిషాల వీడియోలోనే జరగడం గమనార్హం.

కంటెంట్ విషయానికి వస్తే ఆర్మీ ఆఫీసర్ అయిన మహేష్ హాలిడేస్ కోసం కర్నూల్ ట్రైన్ లో బయలుదేరతాడు. ప్రయాణంలో రష్మికతో మొదలైన పరిచయం మెల్లగా ప్రేమకు దారి తీస్తుంది. కట్ చేస్తే కర్నూల్ రాజకీయాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకున్న విలన్ ప్రకాష్ రాజ్ ఎంట్రీ. మరోవైపు ఏ చిన్న తప్పు జరిగినా సహించలేని కాలేజీ ప్రొఫెసర్ విజయశాంతి. ఈ ఇద్దరికీ కర్నూల్ కు వచ్చిన మహేష్ కి కనెక్షన్ ఏంటి, అప్పటికే అక్కడ ఉన్న సమస్యలను మహేష్ ఎలా పరిష్కరించాడు అనేదే అసలు కథగా కనిపిస్తోంది

చాలా కాలం తర్వాత మహేష్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసాడు. అనిల్ రావిపూడి మార్కు కామెడీని కొనసాగిస్తూనే కావలసినంత యాక్షన్ పార్ట్ ని సెకండ్ హాఫ్ లో ఉంచినట్టు క్లూ ఇచ్చేశారు. అయితే గతంలో వచ్చిన రవితేజ వెంకీ, విజయ్ తుపాకీ, నాని ఎంసిఎ, మహేష్ ఒక్కడు ఛాయలు ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. సంక్రాంతి బరిలో కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న సరిలేరు నీకెవ్వరు అల్లు అర్జున్ అల వైకుంఠపురములోకి గట్టి ఛాలెంజ్ ని విసిరేలా ఉంది. అయితే అనిల్ రావిపూడి సూపర్ స్టార్ ని ఎలా డీల్ చేసుంటాడు అనేదాన్ని బట్టి దీని ఫలితం ఆధారపడి ఉంటుంది. సేఫ్ గేమ్ ఆడినట్టు ట్రైలర్ లో అర్థమవుతోంది కాబట్టి బయ్యర్ల పెట్టుబడికి డోకా లేనట్టే కనిపిస్తోంది. ఇంకొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే సంక్రాంతి పోరు ఎలా ఉండబోతోంది వేచి చూడాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి