ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజాదరణ పొందడమే కాదు.. ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నాయి. పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కొన్నిరాష్ట్రాలు ఏపీని అనుసరిస్తున్నాయి కూడా. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఈ పథకాలతో గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం, తగిన పౌష్టికాహారం అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి ముఖ్యమైన అడుగు వేసిందని సోమవారం ట్వీట్ చేసింది. అలాగే మహిళలు కూడా జగన్ ఆలోచనలకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు ఏటా రూ.1863.11 కోట్ల వ్యయంతో బలవర్ధకమైన ఆహారం ప్రభుత్వం అందించనుంది. రక్తహీనత సమస్యలు తగ్గేలా, తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన పోషకాలు అందేలా మెనూ సిద్ధం చేశారు.
హెల్తీ మెనూ
జగన్ తీసుకున్న నిర్ణయంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్నం పెట్టే ఆహారంలో అన్నం, పప్పు, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, కోడి గుడ్డు, 200 మి.లీ పాలు ఇస్తారు. నెలకు ఒక కేజీ రాగి పిండి, ఒక కేజీ సజ్జ/జొన్న పిండి, ఒక కేజీ అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, 250 గ్రాముల ఎండు ఖర్జూరం పెడతారు. అలాగే వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్నం పెట్టే ఆహారంలో అన్నం, పప్పు, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, కోడి గుడ్డు, 200 మి.లీ పాలు. బెల్లం 500 గ్రాములు, మల్టీ గ్రెయిన్ ఆటా 2 కేజీలు, ఎండు ఖర్జూరం, సజ్జ/ జొన్న పిండి.. 500 గ్రాములు ఇస్తారు. 6 నెలల నుంచి 36 నెలల వయసున్న పిల్లల కోసం సంపూర్ణ పోషణ కింద 2.5 కేజీల బాలామృతం, 25 కోడి గుడ్లు, 2.5 లీటర్ల పాలు. గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ కింద 2.5 కేజీల బాలామృతం, 30 కోడిగుడ్లు, 6 లీటర్ల పాలు ఇస్తారు. 3 ఏళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఉన్న పిల్లలకు సంపూర్ణ పోషణలో 20 గ్రాములు ఉడికించిన శనగలు, రోజూ కోడిగుడ్డు, 100 మి.లీ పాలు. సంపూర్ణ పోషణ ప్లస్ పథకంలో బాలామృతంతో చేసిన లడ్డు/ కేకు 50 గ్రాములు, ప్రతి రోజూ కోడి గుడ్డు, 200 మి.లీ పాలు ఇస్తారు. ఈ ఆహారం గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతకు తగ్గేందుకు దోహదపడుతుంది.