కాంగ్రెస్ సీనియర్ నేత, సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. సందేశర గ్రూప్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారుల విచారణ జరిపారు. ఢిల్లీలోని అహ్మద్ పటేల్ నివాసంలో ఈడీ అధికారుల విచారణ చేశారు. సందేశర గ్రూప్ వ్యవహారంలో రూ.5 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతుంది. ఈ కేసులో అహ్మద్ పటేల్ సోదరులకు సంబంధం ఉన్నట్లు ఈడీ గుర్తించింది.
ముగ్గురు సభ్యులున్న ఈడీ దర్యాప్తు బృందం ఈ ఉదయం ఢిల్లీలోని సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ నివాసానికి చేరుకుంది. వేలకోట్ల రూపాయల విలువైన సందేశారా సోదరుల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయనను ప్రశ్నించనున్నామని అధికారులు తెలిపారు. కాగా, మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నమని వారు వివరించారు.
ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అహ్మద్ పటేల్కు గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే వయోవృద్ధులు తమ ఇళ్లకే పరిమితం కావాలన్న కొవిడ్-19 వ్యాప్తి మార్గదర్శకాల అనుసారం.. తాను హాజరు కాలేనంటూ అహ్మద్ పటేల్ తన అశక్తత వెలిబుచ్చారు. ఆయన విజ్ఞప్తిని అమోదించిన ఈడీ, దర్యాప్తు బృందాన్ని మధ్య ఢిల్లీలోని మదర్ థెరిసా క్రిసెంట్ వద్దనున్న ఆయన ఇంటికే పంపేందుకు అంగీకరించింది.
గుజరాత్కు చెందిన స్టెర్టింగ్ బయోటెక్ సంస్థ, ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణాలను పొందింది. అనంతరం చెల్లింపులు లేకపోవటంతో దీనిని నిరర్ధక ఆస్తిగా ప్రకటించారు. కాగా, ఈ రుణం విలువ ప్రస్తుతం రూ.8,100 కోట్లకు చేరినట్టు అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారంలో సంస్థ యజమానులైన చేతన్ సందేశారా, నితిన్ సందేశారా సోదరులతో సహా మరికొందరికి భాగస్వామ్యముందని అనుమానిస్తున్నారు. ఈ కేసుపై సిబిఐ అక్టోబర్ 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నీరవ్ మోడీకి సంబంధమున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంబకోణం కంటే సందేసారా సోదరుల కుంబకోణం మరింత పెద్దదని ఈడీ గతంలో ప్రకటించింది.