దానం నాగేందర్ .. కాంగ్రెస్ వైభవం కొనసాగిన కాలంలో ఓ రేంజ్ లో వెలిగారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో చక్రం తిప్పారు. మంత్రిగా కూడా చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ మారిన రాజకీయ సమీకరణాలతో టీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఈ ఎమ్మెల్యేకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఓ కేసులో నాంపల్లి కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అలాగే రూ.1000 ఫైన్ కూడా విధించింది. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న ఈయనకు ఆ టీఆర్ఎస్ ఉద్యమకారులను కొట్టినందుకే ఈ శిక్ష పడడం విశేషం.
తెలంగాణ ఉద్యమ సమయంలో దానం నాగేందర్ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారు. పలు సందర్భాల్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే అప్పట్లో ఈయనను ఉద్యమకారులు అడ్డుకున్నారు. దీంతో చిర్రెత్తికొచ్చి రెచ్చిపోయిన దానం నాగేందర్ నాడు వారిపై దాడి చేశాడు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో దానం నాగేందర్ మంత్రిగా ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో ఉద్యమకారులు మంత్రులను అడ్డుకుంటున్నారు.
ఈ క్రమంలోనే బంజారాహిల్స్ లో ఓ కార్యక్రమానికి వచ్చిన దానం నాగేందర్ ను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు. అప్పుడు స్వయంగా కారు దిగిన దానం నాగేందర్ కానిస్టేబుల్ చేతిలోని కర్ర తీసుకొని ఉద్యమకారులను చావబాదారు. ఆ ఘటనలో గాయపడిన ఓ వ్యక్తి పోలీస్ కేసు పెట్టారు. ఆ కేసు విచారణ ఇటీవలే ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులపై కేసులను శరవేగంగా తేల్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ప్రజాప్రతినిధుల కోర్టు ఏర్పాటైంది. ఇందులో నేతల కేసుల విషయంలో విచారణలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే దానం నాగేందర్ కేసులో విచారణ పూర్తి కావడంతో ఆయనకు 6 నెలల జైలు రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు శిక్షను నెలరోజుల పాటు కోర్టు వాయిదా వేసింది.
తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకున్నాడని ఈరోజే పీసీసీ చీఫ్ గా ఎంపికైన రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడే అదే టీఆర్ఎస్ లోకి నాడు ఉద్యమకారులను చితక్కొట్టిన కేసులో దానంకు శిక్ష పడడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసిన వారిని కేసీఆర్ ఆదరించారనడానికి ఇదో నిదర్శనం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.