ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు మంగళవారం కర్నూలు పర్యటనలో ఉన్నారు. మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం జగన్ కర్నూలు కేంద్రంగా ప్రారంభించారు. సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న కంటి వైద్య పరీక్షలను ఆయన పరిశీలించారు. అంతకు ముందు ప్రాధమిక ఆర్యోగ ఉప కేంద్రాల నిర్మాణాలకు లాంఛనంగా శంకుస్థాపన చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 వేల ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మించాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ రోజు కర్నూలులో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత సీఎం జగన్ మొదటిసారిగా కర్నూలు రావడంతో.. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తమ ఆకాంక్ష మేరకు దాదాపు 64 ఏళ్ల తర్వాత తిరిగి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడంతో ప్రజల్లో సంతోషాలు వెల్లివిరిశాయి. రాయలసీమ న్యాయవాదులు థ్యాంక్యూ సీఎం సర్ అంటూ.. కృతజ్ఞతలు తెలిపారు. మరికొద్ది సేపట్లో సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.