ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీ సీఆర్డీఏ) రాజధాని అమరావతిలో చేపట్టిన పనులు, కార్యకలాపాలపై నిపుణుల కమిటీ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కన్సల్టెన్సీలు, డిజైన్ల పేరుతో ప్రజాధనం భారీ ఎత్తున దోపిడీ జరిగిందని కమిటీ నిగ్గు తేల్చింది. రాజధానిలో ఏది చూసినా అస్తవ్యస్తంగా ఉందని, అసాధారణంగా ఫీజులు పెంపు, ఒకే పనికి పలు కన్సల్టెన్సీల పేరుతో భారీగా చెల్లింపులు జరిగినట్లు స్పష్టం చేసింది.
నిపుణుల కమిటీ నివేదికలో కీలక అంశాలు…
– రాజధాని మాస్టర్ ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని చెప్పిన గత సర్కారు అందుకు విరుద్ధంగా సుర్బానాకు రూ.11.92 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుని రూ.16.64 కోట్లకు పెంచింది.
– సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అధిక వ్యయంతో రాజధాని నిర్మాణ ప్రణాళిక రూపొందించారు.
– బిడ్లు ఆహ్వానించకుండానే ఆర్కిటెక్ట్స్, కన్సల్టెన్సీ ఏజెన్సీలను ఇష్టానుసారంగా ఎంపిక చేశారు.
– ప్రభుత్వ భవనాల డిజైన్ల తయారీకి తొలుత జపాన్కు చెందిన మకీ అసోసియేట్ను ఎంపిక చేసి తర్వాత ఫోస్టర్ అండ్ పార్టనర్కు అత్యధిక ఫీజుతో అప్పగించారు.
– మాస్టర్ ప్రణాళిక, సీడ్ క్యాపిటల్, జ్యుడిషియల్ కాంప్లెక్స్, లెజిస్లేచర్ భనవాల డిజైన్లను ఏజెన్సీలకు అప్పగించడంలో ప్రామాణిక విధానాలను పాటించలేదు.
– దశలు, ముగింపు ప్రణాళికలు లేకుండా మౌలిక వసతుల ప్రాజెక్టులను ఇష్టానుసారంగా చేపట్టడంతో వ్యయం ఇప్పటికే అధికంగా ఉంది.
– ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ విధానంలో రూ.8 వేల కోట్ల విలువైన పనులను చేపట్టి అత్యధికంగా చెల్లించారు.
– ఆర్కిటెక్చరల్ డిజైన్ల పేరుతో కన్సల్టెంట్లకు రూ.270 కోట్ల ఫీజు చెల్లించారు. ఈ విధంగా చెల్లించడం డూప్లికేషన్ అవుతుంది.
– అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్ల తయారీని ఫోస్టర్–పార్టనర్ కన్సారి్టయం కన్సల్టెన్సీకి తొలుత రూ.60.72 కోట్లకు అప్పగించి రూ.121.76 కోట్లకు పెంచేశారు.
– రాజధానిలో 39 ప్రాజెక్టుల విలువ రూ.25,877.67 కోట్లు కాగా డిజైన్ల కన్సల్టెన్సీ ఫీజుగా ఒక శాతం అంటే రూ.258.77 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఏకంగా 2.12 శాతం మేర రూ.549.73 కోట్లను చెల్లించారు. రూ.290 కోట్లు అత్యధికంగా చెల్లించడం అసాధారణం.