2020 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. విశ్వంలోని కృష్ణబిలంపై,పాలపుంతపై పరిశోధనలకు గాను బ్రిటన్ శాస్త్రవేత్త రోజర్ పెన్రోజ్,జర్మనీ శాస్త్రవేత్త రీన్హర్డ్ గెంజెల్,అమెరికన్ ప్రొఫెసర్ అండ్రియా గెజ్లకు నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
అనేక సంవత్సరాలుగా బ్లాక్ హోల్స్,పాలపుంతల రహస్యాలను తెలుసుకునేందుకు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు విశేష పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుగొన్న సాపేక్ష సిద్ధాంతమే కృష్ణబిలాలు ఏర్పడటానికి మూలమని రోజర్ పెన్రోజ్ కనుగొన్నాడు.తన పరిశోధనల ద్వారా కృష్ణ బిలం ఎలా ఏర్పడుతుందో పెన్రోజ్ సూత్రీకరించాడు. ఇక పాలపుంత కేంద్రంలో దుమ్ము, ధూళి, ఇతర వాయువులతో కూడిన దట్టమైన మేఘాలు ఉన్నట్లు రిన్హార్డ్ గెంజెల్,అండ్రియా గెజ్ తమ పరిశోధనల ద్వారా నిరూపించారు.ఈ పరిశోధనలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.
బ్లాక్హోల్స్పై ఈ ముగ్గురు విశేష పరిశోధనలు చేస్తున్నారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రశసించింది. బ్లాక్ హోల్స్ సాపేక్ష సిద్ధాంతానికి బలమైన ఆధారాలను కనుగొన్నారని పేర్కొంది. బ్రిటన్కు చెందిన రోజర్ పెన్రోజ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నారు.కాగా ప్రైజ్ మనీని రెండు భాగాలుగా విభజించి ఒక భాగం రోజర్ పెన్రోజ్కి, మిగతా భాగాన్ని గెంజెల్,ఆండ్రియా గెజ్లకు చెరిసగం అందజేయనున్నారు.
ఇక భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎన్నికైన నాలుగో మహిళగా ఆండ్రియా గెజ్ రికార్డు సృష్టించారు. ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మకర పురస్కారాన్ని డోనా స్ట్రిక్ల్యాండ్, మరియా గోపెర్ట్ మేయర్,మేరీ క్యూరీ అందుకున్నారు.